రుద్రంపూర్: సింగరేణికి సంబంధించి చాతకొండ పరిధిలోని 44–29 ఎకరాల భూమిని కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఈమేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. సుమారు 40ఏళ్ల క్రితం గనుల్లోకి కావాల్సిన ఇసుకను రోప్వే ద్వారా తీసుకొచ్చి తెల్ల వాగు సమీపాన డంప్ చేసేవారు. అయితే గనుల్లో ఇసుక వాడకం తగ్గడంతో రోప్వే విధానాన్ని రద్దుచేయగా, సంస్థ ఈ స్థల పరిరక్షణను విస్మరించింది. దీంతో స్థానికులు ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఈమేరకు సెక్యూరిటీ సిబ్బంది.. ఎస్టేట్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, పంటలు ఉండడంతో ఇన్నాళ్లు వేచి ఉన్నారు. ప్రస్తుతం పంట కోతలు పూర్తికావడంతో స్థలాన్ని చదును చేయిస్తూ మంగళవారం ఫెన్సింగ్ వేసే క్రమాన ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పంటలు పూర్తిగా తీసుకునే వరకు ఇవ్వాలని స్థానికులు కోరగా అధికారులు మరో మూడు రోజుల గడువు ఇచ్చారు.
సింగరేణి ఆధీనంలోకి 44 ఎకరాల భూమి


