కారేపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని కొత్తకమలాపురానికి చెందిన శాగంటి కృష్ణయ్య(46) వ్యవసాయంలో పెట్టుబడి కోసం అప్పులు చేయగా, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లి వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమాన పెరిగిన అప్పులు తీర్చే మార్గంలేక ఆదివారం స్వగ్రామానికి వచ్చిన కృష్ణయ్య పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు భార్య స్వప్న, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ఇంటర్ పాస్ కాలేదనే మనస్తాపంతో విద్యార్థిని..
ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయనే మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన గుగులోతు బాలాజీ–అరుణ దంపతులు కుమార్తె సంజన(17) కారేపల్లిలోని తాతయ్య–నాన్నమ్మ ఇంట్లో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివించింది. ఇటీవల ఫలితాల్లో ఆమె ఫెయి ల్ కాగా, ఈనెల 17వ తేదీన ఎలుకల మందు మింగింది. ఈమేరకు కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది.


