ఖమ్మంమయూరిసెంటర్: ఓ పోలీసు ఉద్యోగి విధుల్లో బాధ్యతగా వ్యవహరించడమే కాక తన ఇంటి జరిగే శుభకార్యంలోనూ పలువురికి అవగాహన కల్పించేలా ముందడుగు వేశాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బోనగిరి నాగేశ్వరరావు – విజయలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె వివాహం ఈనెల 30న జరగనుంది. ఈమేరకు ఆహ్వాన పత్రికను అందరిలా కాకుండా తన వృత్తిధర్మాన్ని కలగలిపి రూపొందించడం ఆకట్టుకుంటోంది. శుభకార్యానికి ఆహ్వానం పలుకుతూనే... సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సైబర్ హెచ్చరికలు, అపరిచిత లింక్లతో జాగ్రత్తలు, ఉచిత బహుమతుల ప్రకటనలకు దూరంగా ఉండడం, పార్సిళ్లలో జరిగే మోసాలు, డిజిటల్ భద్రత, పెట్టుబడి మోసాలు ఎలా జరుగుతాయో క్షుణ్ణంగా వివరించారు. అలాగే సైబర్ నేరానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం సూచించగా.. కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.
వివాహ ఆహ్వానపత్రికపై భద్రతా సూచనలు


