అశ్వారావుపేటరూరల్/భద్రాచలంటౌన్/దమ్మపేట: పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఆయన అశ్వారావుపేట మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిని సందర్శించారు. గ్రామంలో కొండరెడ్లు నిర్వహించిన మా మిడి కాయల పండుగకు హాజరయ్యారు. ఏటా మామిడి కాయల సీజన్ కావడంతో కొండరెడ్లు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజ లు చేశారు. ఊరంతా మామిడాకులు, ఆరిటాకులతో తోరణాలతో అలంకరించారు. నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. పీఓ కూడా కొద్దిసేపు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఊరంతా ఆటపాటలతో పండుగ జరుపుకోవడం హర్షణీయమని అన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వీసీకి దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐటీడీఏ పీఓ బి. రాహుల్, తహసీల్దార్లు హాజరయ్యారు.
అర్జీలు పరిష్కరించాలి
గిరిజన దర్బార్కు వచ్చే ప్రతీ అర్జీని పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు, స్వ యం ఉపాధి రుణాలు, రైతుబంధు, వైద్య సహాయం, ట్రైకార్ రుణాలు, గిరివికాసం ద్వారా సౌర విద్యుత్ కనెక్షన్లు, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం, వ్యవసాయ బోరు మోటార్ల కోసం గిరిజనుల నుంచి విజ్ఞప్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్, ఎస్డీసీ ఆనంద్ కుమార్, సర్పంచ్ గుజ్జు సంకురురావు, గ్రామస్తులు గురుగుంట్ల బాబురెడ్డి, సోమిరెడ్డి, మంగిరెడ్డి, కొటిరెడ్డి దుర్గారెడ్డి, చల్లెమ్మ, సీతమ్మ, సంధ్య పాల్గొన్నారు.
ఎన్ఐటీ విద్యార్థికి అభినందన
నిరుపేద కుటుంబంలో పుట్టి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ఎన్ఐటీలో బీటెక్ సీటు సాధించిన ఆదివాసీ బాలిక వాగె సంధ్యను ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించారు. సోమవారం తన కార్యాలయంలో రూ. 50 వేల ప్రోత్సాహక చెక్కును పీఓ అందజేశారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్


