ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలోని రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, మీ సేవ కేంద్రాల మేనేజర్లతో ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతీ రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్‌ ఐడీ) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భూమి కలిగిన ప్రతీ రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్‌ రిజిస్ట్రీ రూపొందిస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్‌ ఐడీ జారీ చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఫార్మర్‌ రిజిస్టేషన్‌ను అనుసంధానం చేస్తారని చెప్పారు. ఇక నుంచి పీఎం కిసాన్‌ పథకం లబ్ధి పొందాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. రాబోయే వర్షాకాలం సీజన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యూరియా, ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అవుతుందని వివరించారు. రైతులు ఆధార్‌ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్‌, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్‌ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

అశాసీ్త్రయమైన కోర్సులను ప్రవేశపెట్టొద్దు

ఖమ్మం సహకారనగర్‌: ఉన్నత విద్యలో అశాసీ్త్రయమైన కోర్సులుప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఆదివారం జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన విద్యాసదస్సులో వివిధ అంశాలపై విశ్లేషకుడు డాక్టర్‌ అందె సత్యం, విశ్రాంత ఆచార్యులు కోయ కోటేశ్వరరావు, ఎడమ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విశ్వవిద్యాలయాలే స్వయంగా నిధులు సమకూర్చుకుని నడపడం వల్ల ధనిక విద్యార్థులకే అవకాశం దక్కుతోందన్నారు. ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని తెలిపారు. అలాగే, గ్రేడింగ్‌ విధానం ద్వారా డిగ్రీ చదివే వారి సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు. అంతేకాక ప్రీ ప్రైమరీ విధానం పిల్లల్లో మనోవికోసాన్ని పెంచేలా ఉండాలే తప్ప చదువును ఆ స్థాయిలో చేర్చొద్దని సూచించారు. అనంతరం పలు ప్రతిపాదనలను ఆమోదించారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మోహన్‌, కె.రామారావుతో పాటు అలవాల నాగేశ్వరరావు, శివన్నారాయణ, ఎల్‌వీ.రెడ్డి, అరుణశ్రీ, మల్లెంపాటి వీరభద్రరావు, వంజాకు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు గిరిజన దర్బార్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.

తహసీల్‌లో ప్రజావాణి

తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ ధనియాల వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement