భద్రాచలంటౌన్: భద్రగిరి పుణ్యక్షేత్రంలో గోదావరి మాత నదీ హారతి కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో కరకట్ట వద్ద నిర్వహించిన ఈ వేడుకలో సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, 108 ప్రమిదలతో దీపోత్సవం, గోదావరి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రస్వామికి 12 సార్లు, గోదావరి నదికి 21 సార్లు విశేష హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ వర్మ, రామాచార్యులు, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు.
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలంటౌన్: శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


