భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జిసెంటర్ లోని శిశుగృహం పరిసరాల పరిశుభ్రతపై భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ స్పందించారు. సమీపంలో ఉన్న పండ్ల దుకాణాల వద్ద పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం చిన్నారుల బాగోగులపై ఆరా తీశారు. కార్యక్రమంలో శిశుగృహం మేనేజర్ చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.
పీజీ కోర్సులకు ముందడుగు
చుంచుపల్లి: ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కింగ్ కోటి, పఠాన్చెరు ఆస్పత్రులతో పాటు భద్రాచలం ఏరియా ఆస్పత్రి కూడా ఎంపిక కావడం విశేషం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం డీసీహెచ్ఎస్ జి.రవిబాబును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయానికి పిలిపించగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పీజీ కోర్సులు ప్రారంభమైతే గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు, వైద్యవిద్యలో ఒక ముందడుగుగా నిలుస్తుందని డీసీహెచ్ఎస్ రవిబాబు వివరించారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ బదిలీ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ఆయనను మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్కు చెందిన విక్రాంత్ కుమార్ 2025 జనవరిలో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మెదక్ అదనపు ఎస్పీగా ఉన్న ఎస్.మహేందర్ స్థానంలో ఆయనను నియమించారు. అయితే, భద్రాచలం ఏఎస్పీగా మాత్రం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు.


