సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ఏడు రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. వీసీకి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో వంటగది, పారిశుద్ధ్యం, మరమ్మతు పనులు చేపడతామని, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తామని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, పీడీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


