● నేటి నుంచి నిర్వహణకు ఆదేశాలు ● చిన్నారులకు వేసవిలో ఉపశమనం
భద్రాచలంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒకటే పూట నిర్వ హించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలు కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా లేకపోగా.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన బుధవారం నుంచి ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12–30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఇక మే 1 నుంచి 31వ తేదీ వరకు కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయాన కేంద్రాల్లో పిల్లలకు భోజనం వడ్డించే బదులు వారి ఇళ్లకే సరుకులు అందిస్తారు. మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా సెలవులు ప్రకటించినప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
60 వేల మందికి పైగా చిన్నారులు
భద్రాద్రి జిల్లాలో చాలా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో వసతులు సరిగ్గా లేకపోవడంతో ఎండ కారణంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలకు గాను 8,829 మంది గర్భిణులు, 3,652 మంది బాలింతలకు పౌష్టికాహారం, ఇతర సేవలు అందుతున్నాయి. అలాగే, మూడేళ్ల లోపు 34,944 మంది, 3–6 ఏళ్ల లోపు చిన్నారులు 31,711 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. ఎండ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పంపించడం లేదని ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఏప్రిల్ నెలంతా ఒక పూట నిర్వహణకు నిర్ణయించారు.
అంగన్వాడీ కేంద్రాలను ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీవరకు కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 వరకే నిర్వహిస్తాం. ఈ విషయమై తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాం.
–స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి


