చుంచుపల్లి/పాల్వంచ: క్షయ సోకిన వారు ఆందోళన చెందకుండా సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రపంచ క్షయవాధి నివారణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల టీబీ క్యాంపెయిన్ను కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించాక డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ వ్యాధి సోకిన వారు మందులు వాడుతూనే పౌష్టికాహారం తీసుకుంటే నిర్మూలించవచ్చని తెలిపారు. మందులు వాడుతున్నంత కాలం ప్రభుత్వం నెలకు రూ.వేయి చొప్పున ఇవ్వనుందని చెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మాట్లాడుతూ క్షయపై అవగాహన పెంచుకుని వ్యాధిని అంతం చేయటంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ పుల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ లలిత, కార్పొరేటర్ శ్రీలక్ష్మి, రిషిత, డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య దినోత్సవాలు తప్పనిసరిగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ సూచించారు. ఆరోగ్య దినోత్సవాలు, శ్రీరామ నవమి సందర్భంగా శిబిరాల ఏర్పాటుపై పాల్వంచలోని కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన సూచనలు చేశారు. అలాగే, వేసవి దృష్ట్యా వడదెబ్బ కేసులపై దృష్టి సారించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎం.శ్రీధర్, పీఓలు పుల్లారెడ్డి, స్పందన, ప్రతాప్, బి.రామదాస్, దినేష్ పాల్గొన్నారు.
సబ్స్టేషన్ పనుల్లో వేగం పెంచండి
బోనకల్: సబ్ స్టేషన్ల నిర్మాణం, కొత్త లైన్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరి మోహన్రావు ఆదేశించారు. బోనకల్ మండలం చిరునోముల, బ్రాహ్మణపల్లిలో ఉపకేంద్రాల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా నిర్మిస్తున్న సబ్స్టేషన్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడడంతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ టి.సురేందర్, ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఈలు భద్రు, వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, ఏడీఈలు ఏ.కిరణ్ కుమార్, వైవీ.ఆనంద్కుమార్, ఏఈ టి.మనోహర్ పాల్గొన్నారు.


