ఇసుక రవాణాలో
జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ చిక్కులు
లారీలపై కవర్ కప్పే
అంశంలో వివాదం
చర్ల మండలంలో నిలిచిపోయిన
ఇసుక లారీలు
ఉపాధికి గండికొడుతున్నారని
గిరిజనుల ఆవేదన
క్వారీల నిర్వహణ లోపాలు
పట్టని టీజీఎండీసీ
కవర్ పంచాయితీ!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో పీసా చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో, కనీసం నిర్మాణం జరగని ప్రదేశంలో డీసిల్టింగ్ పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. రీచ్ల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. దీంతో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. చర్ల మండలంలో సీ కత్తిగూడెం, జీపీపల్లి, వీరాపురం గ్రామాల సమీపంలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి హైదరాబాద్కు రవాణా కావాల్సిన ఇసుక లారీలు శుక్రవారం రోజంతా నిలిచిపోయాయి. రీచ్ నుంచి ఇసుక నింపుకుని లారీ బయటకు రాగానే, లారీలో ఇసుకను సమం చేసి, దుమ్ము ఎగిసిపడకుండా కవర్ కప్పుతారు. ఇందుకోసం ఒక్కో లారీకి రూ.1100 వంతున చార్జీ నిర్ణయించారు. ఈ పనిని ఎవరు నిర్వహించాలనే విషయమై చర్ల మండలం సీ కత్తిగూడెం రీచ్ దగ్గర వివాదం తలెత్తింది. దీంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. రోజూ రీచ్ల నుంచి 500 లారీల ఇసుక హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండగా శుక్రవారం కనీసం వందలారీలు కూడా బయటకు రాలేదు.
లారీలను అడ్డుకున్న స్థానికులు
ఇసుక లారీలపై కవర్ కట్టే పనిని వీరాపురం, జీపీపల్లి, సీ కత్తిగూడెం గ్రామాల గిరిజనులు వంతుల వారీగా నిర్వహించేవారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీల కారణంగా గిరిజనేతరులు ఈ పనిలోకి వచ్చారు. కాగా, కవర్ కప్పే పనిలోకి 15 మంది గిరిజనులను అదనంగా తీసుకోవాలని స్థానికులు కోరగా, రైజింగ్ కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో పీసా, 1/70 చట్టాలు అమల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనుల హక్కులను కాలా రాస్తున్నారని, గిరిజన యువతకు కనీస ఉపాధి కల్పించడంలేదంటూ స్థానిక మహిళలు ఇసుక లారీలను అడ్డగించారు.
గొడవలు పెడుతున్నారు..
ఇసుక ర్యాంపుల్లో రైజింగ్ కాంట్రాక్టర్ల నిర్వహణలోపం, టీజీఎండీసీ అధికారుల పట్టింపులేనితనం కారణంగా స్థానికుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి వస్తోందని చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక గిరిజన నేత ఇర్పా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇసుక రీచ్ల దగ్గర పనుల కోసం, ఉపాధి అవకాశాల పేరిట మొదటగా గిరిజ నులు, గిరిజనేతరుల మధ్య దూరం పెంచి, ఆ తర్వాత గొడవలు సృష్టించి, చివరకు లా అండ్ ఆర్డర్ సమస్యగా మార్చి తమ గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. స్థానిక గిరిజనులు ఆయనకు మద్దతుగా నిలిచారు.
స్పందించని టీజీఎండీసీ
వివాదంతో రోజంతా లారీలు నిలిచిపోయినా టీజీ ఎండీసీ స్పందించలేదు. ఫలితంగా లారీడ్రైవర్లు తిండీతిప్పలకు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నిర్దేశించి విధంగా డీడీలు, పన్నులు చెల్లించినా సకాలంలో తాము పని చేసుకోలేకపోయాని, అనవసర వెయిటింగ్ వల్ల నష్టానికి టీజీఎండీసీ బాధ్యత వహిస్తుందా అని లారీల యజమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా టీజీఎండీసీ పీఓ శంకర్నాయక్ అందుబాటులోకి రాలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్, ఐటీడీఏ పీఓ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
మేడారం జాతర మొదలవడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల మీదుగా ఇసుక రవాణా ఆపేశారు. దీంతో హైదరాబాద్ మార్కెట్కు జిల్లా నుంచే నిత్యం రెండు వేల లారీల్లో ఇసుక రవాణా అవుతోంది. దీంతో చర్ల మండలంలోని ఇసుక రీచ్లు, ర్యాంప్లు లారీలతో కిక్కిరిసిపోయాయి. లారీల రాకపోకలతో భద్రాచలం–పాల్వంచ–ఇల్లెందు మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. రెండు మూడు జిల్లాల లోడంతా భద్రాద్రి జిల్లాపైనే పడుతున్నా ఇసుక రవాణాపై తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కనీసం శ్రద్ధ పెట్టడంలేదు.
ఇసుక రవాణాలో


