పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
రైతులకు గిట్టుబాటు
ధర ఇస్తాం..
భద్రాచలం: సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు భద్రగిరి మార్టు కోసం విక్రయిస్తే గిట్టుబాటు ధరలను ఇస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయంలోని అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (వ్యవసాయ విభాగం) ఉదయ్కుమార్ను 95818 10020 నంబర్లో లేదా, భద్రాచలంలోని భద్రగిరి మార్ట్లో సంప్రదించాలని సూచించారు.
సర్దార్ సర్వాయి
పాపన్నగౌడ్కు నివాళి
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి, గౌడ సంఘ నాయకులు బండి రాజుగౌడ్, బుర్ర ధన్రాజ్, కమ్మగాని శంకర్, పాసిని వెంకన్న, బొమ్మగాని రమేష్, లక్ష్మీనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూములను
ఆక్రమిస్తే కఠిన చర్యలు
అశ్వాపురం: అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ హెచ్చరించారు. గురువారం ఆయన అశ్వాపురం రేంజ్లో పర్యటించారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ బీట్లో వలస ఆదివాసీలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఆక్రమించి వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని డీఎఫ్ఓ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం అశ్వాపురం బీట్లో కొమ్ముగూడెం ప్లాంటేషన్, అటవీ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఉపేందర్, డీఆర్ఓలు సుజాత, ధనలక్ష్మి, వెంకటరావు, కిరణ్, సునీల్, ఉపేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
పదో తరగతి పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఐదో రోజు పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గురువారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 12,728 మందికి గాను 12,700 మంది హాజరయ్యారు. 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 268 మందికి గానూ 241 మంది హాజరు కాగా, 27 గైర్హాజరయ్యారు. కలెక్టర్ అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, జిల్లా విద్యాశాఖాధికారి మూడు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మూడు సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ 17 సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.


