కౌసల్యా తనయా.. | - | Sakshi
Sakshi News home page

కౌసల్యా తనయా..

Jan 17 2026 8:23 AM | Updated on Jan 17 2026 8:23 AM

కౌసల్

కౌసల్యా తనయా..

రఘుకుల తిలకుడికి

ఘనంగా విశ్వరూప సేవ

సర్వదేవతాలంకరణతో

ఉట్టిపడిన ఆధ్యాత్మికత

భదగ్రిరిలో స్వామివారిని కనులారా వీక్షించిన భక్తులు

కోసల

రామా..

భద్రాచలం: భద్రగిరిలో మాత్రమే ప్రత్యేకమైన విశ్వరూప సేవ భక్తులను అలరించింది. మహాదర్బార్‌ సేవలో ఆశీనులైన అర్చనామూర్తులు, సర్వదేవతల నడుమ కొలువుదీరి ఉన్న సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను భక్తజనం కన్నుల నిండుగా దర్శించుకున్నారు. ధూప, దీప నైవేద్యాలు, చుట్టూ 108 మంది అర్చనామూర్తుల నడుమ జగాలను ఏలే జగదభి రాముడికి జరిగిన ‘మహా దర్బార్‌’ ఆద్యంతం ఆధ్యాత్మికతను చాటింది. గరుత్మంతుడి వాహనంపై రాజాధిరాజుగా భద్రాచల రామయ్య దర్శనంతో భద్రగిరి పులకించింది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం విశ్వరూప సేవను వేద పండితులు, ఆలయ అర్చకులు వైభవోపేతంగా జరిపారు.

భద్రాచలంలోనే ప్రత్యేకం..

ముక్కోటి ఉత్సవాలు ముగిశాక బహుళ ద్వాదశి రోజున ఈ వేడుకను నిర్వహించటం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఆనవాయితీ. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో మాత్రమే ఈ వేడుక జరగడం ప్రత్యేకత. సంవత్సరకాల పూజల్లో దొర్లే దోషాల నుంచి ప్రాయశ్చిత్తం కోసం శ్రీ సీతారామలక్ష్మణ స్వామి, ఆలయం ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉండే అర్చనా మూర్తులను ఒకే చోటకు చేర్చి ఏకకాలంలో సేవలను నిర్వహించటం ఈ విశ్వరూప సేవ విశిష్టత. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోలేని భక్తులు ముక్కోటి దేవతలు కొలువై ఉన్న విశ్వరూప సేవ నాడు దర్శించుకుంటే ఆ నాటి పుణ్యఫలం దక్కుతుందని పండితులు పేర్కొంటున్నారు.

కదంబ ప్రసాద నివేదన..

తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గర్భగుడి నుంచి మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చి దీపారాధన, మహాప్రభుతోత్సవం జరిపారు. సువర్ణ పుష్ప పూజ, వేద విన్నపాలు, దండ దీపాంజలి, హారతి, అష్టోత్తర శతనామార్చన చేశారు. ప్రత్యేక పూజలనంతరం స్వామి వారికి ప్రత్యేక కదంబ ప్రసాదం నివేదించారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్వ బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

రామయ్య కీర్తనల నడుమ..

విశ్వరూప సేవను పురస్కరించుకుని బేడా మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్‌ దీపాలతో, రంగు రంగుల షామియానాలతో సర్వాంగ సుందరంగా వేదికను రూపొందించారు. స్థానాచార్యులు రామచంద్ర.. రఘువీర.. రామచంద్ర.. రణధీర తదితర రామయ్య కీర్తనలను రాగయుక్తంగా ఆలపిస్తుండగా, భక్తులు శ్రీరామయనమః అంటూ శృతి కలిపారు. జై శ్రీరామ్‌ నామ స్మరణలతో భద్రగిరి మార్మోగింది. స్వామి వారి విశ్వరూప సేవ అనంతరం ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు గర్భగుడిలో స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కొల్లు దామోదర్‌రావు దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు, ఈఈ రవీందర్‌, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌, భవాని రామకృష్ణ, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మకర సంక్రాంతి రోజున రథోత్సవం

మకర సంక్రాంతిని పురస్కరించుకుని గురువారం రథోత్సవాన్ని ఘనంగా జరిపారు. వెండి రథంలో కొలువుదీరిన రామయ్యను ఊరేగింపుగా తాతగుడి సెంటర్‌ వరకు తీసుకొచ్చారు. శుక్రవారం బేడా మండపంలో నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. సెలువులు కావడంతో ఆలయంలో భక్తులతో రద్దీ నెలకొంది.

కౌసల్యా తనయా..1
1/1

కౌసల్యా తనయా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement