సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

Oct 22 2025 7:26 AM | Updated on Oct 22 2025 7:26 AM

సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

సీసీఐ పత్తి కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి ● ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ప్రామాణికం ● విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దు

● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి ● ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి ప్రామాణికం ● విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దు

ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పచ్చజెండా ఊపింది. జిన్నింగ్‌ మిల్లుల ఎంపిక, టెండర్ల నిర్వహణ పూర్తి కావడంతో కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈమేరకు తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్‌ ఇండస్ట్రీస్‌లో తొలి కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా పత్తి క్వింటాకు గరిష్టంగా రూ. 8,110 ధర నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ, నాణ్యత పేరిట రూ.6,500కు మించి చెల్లించడం లేదు. ఇంతలోనే సీసీఐ కేంద్రాలకు ఏర్పాటుకు జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ముందుకు రాకపోతే ప్రభుత్వం జోక్యంతో కొనుగోళ్లకు లైన్‌ క్లియర్‌ అయింది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 4.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ పంట ద్వారా 50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

14 మిల్లులకు అనుమతి

పత్తి కొనుగోళ్లకు ఖమ్మం జిల్లాలో జీఆర్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌(వెంకటగిరి), శ్రీసాయి బాలాజీ జిన్నింగ్‌ మిల్‌(తల్లంపాడు), అమరావతి టెక్స్‌టైల్స్‌(దెందుకూరు), మంజీత్‌ కాటన్‌ మిల్స్‌(మాటూరు), శ్రీ శివగణేష్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌(ఇల్లెందులపాడు), స్టాపిలచ్‌ జిన్నింగ్‌ ఇండస్ట్రీస్‌(తల్లాడ), జీఆర్‌ఆర్‌ జిన్నింగ్‌ మిల్‌(పొన్నెకల్‌), శ్రీ భాగ్యలక్ష్మీ ఇండస్ట్రీస్‌(గోల్‌ తండా)ను ఎంపిక చేశారు. భద్రాద్రి జిల్లాలోని శ్రీరామా కాటన్‌ ఇండస్ట్రీస్‌(అశ్వాపురం), అనూశ్రీ కాటన్‌ ఇండస్ట్రీ(బూర్గంపాడు), మంజీత్‌ జిన్నింగ్‌ మిల్స్‌(కొత్తగూడెం), లక్ష్మీ కొటెక్స్‌ జిన్నింగ్‌ మిల్‌(కారేపల్లి)లో కొనుగోళ్లు చేపడుతారు. ఇవి కాక బూర్గంపాడు మార్కెట్‌ పరిధి రెండు జిన్నింగ్‌ మిల్లుల్లోనూ కొన్నాళ్ల తర్వాత కొనుగోళ్లు మొదలవుతాయి.

ఎకరాకు 12 క్వింటాళ్లు

పంట దిగుబడిని అంచనా వేశాక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అవకాశం కల్పించారు. అయితే, ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. ఎకరాకు ఐదు క్వింటాళ్లు మించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కాగా, వ్యవసాయ శాఖ పోర్టల్‌లో పంట నమోదై ఉండడమే కాక ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే విక్రయానికి అనుమతిస్తారు. కాగా, పత్తి విక్రయాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్‌) విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది కౌలు రైతుల కోసం అమలుచేస్తే, కొందరు ఉద్యోగులు, వ్యాపారులు ఏకమై రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి టీఆర్‌ పేరిట జిన్నింగ్‌ మిల్లుల్లో మద్దతు ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేసి పట్టాదారు పేరిట పంట నమోదైన వివరాలు, పట్టాదారు అనుమతితో కౌలు రైతు పంట విక్రయానికి వీలు కల్పించే బాధ్యత ఏఈఓలకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement