
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్
సూపర్బజార్(కొత్తగూడెం): స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎంసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వివరాలను పోలీస్ అధికారులకు అందించాలని సూచించారు. ఎంపీడీఓలు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు నామినేషన్ ఫారాలను ముందుగానే తనిఖీ చేసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. స్వీకరించిన నామినేషన్లను అదే రోజు టీ–పోల్ సైట్లో అప్లోడ్ చేయాలని, రోజువారీ నివేదికలు అందజేయాలని వివరించారు. తహసీల్దార్లు (మండల ఎంసీసీ నోడల్ అధికారులు) ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల నివేదికలను సేకరించి జిల్లా నోడల్ అధికారులకు పంపాలని సూచించారు. జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సంబంధిత ఆర్డీఓ/సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బ్యాలెట్ పేపర్ తయారీ, ముద్రణను తెలుగు వర్ణమాల క్రమంలో నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ సామగ్రిని కేంద్రాల వారీగా వేరు చేసి భద్రంగా ఉంచాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ఎస్హెచ్ఓ/సీఐల నుంచి అనుమతులు పొందాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, 13న అప్పీల్ స్వీకరణ, 14న అప్పీల్ విచారణ జరుగుతాయన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.