
ఎన్నాళ్లీ వేతన వెతలు?
ఉపాధి సిబ్బందికీ అంతే..
జీతాల చెల్లింపులో రెండు నెలలుగా జాప్యం
ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్మికుల నిరీక్షణ
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు
వేతనాలు విడుదల చేయాలి
రెండు నెలలుగా ఇబ్బంది..
చుంచుపల్లి: వేతనాలు సకాలంలో అందక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీల్లోనూ అదేతీరు
గ్రామపంచాయతీ కార్మికులకు కూడా రెండు నెలలుగా వేతనాలు రావడంలేదు. జిల్లాలో 471 జీపీల్లో 2,129 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో వాటర్మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్, పంపు ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోజూ తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.9,500 చొప్పున ఆన్లైన్ ద్వారా నేరుగా వేతనం చెల్లిస్తారు. వీరితోపాటు అత్యవసరాల మేరకు తాత్కాలికంగా పనిచేసే వారికి నెలకు రూ.5 వేలు వరకు చెల్లిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 12 నుంచి 15 మంది వరకు, చిన్న పంచాయతీల్లో ఎనిమిది మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఉపాధి, పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. గడిచిన రెండు నెలలుగా ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదని, అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని పేర్కొంటున్నారు. వచ్చే దసరా పండుగ రోజు వరకై నా వేతనాలు అందించాలని కోరుతున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 219 మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరిలో ఏపీఓలు 21 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 21 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 105 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 72 మంది ఉన్నారు. గతంలో మూడు నెలల చొప్పున జూన్ వరకు వేతనాలు విడుదల చేశారు. జూలై, ఆగస్టు సంబంధించి రెండు నెలల వేతనాలు ఇంతవరకు అందలేదు. ప్రతినెలా వేతనాలకు సంబంధించిన ఎఫ్టీఓ జనరేట్ చేసి పంపుతున్నా కానీ జీతాలు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర శాఖలో తగిన బడ్జెట్ లేకపోవడంతోనే వేతనాలు ఆలస్యం అవుతున్నాయని అనధికార సమాచారం. అయితే సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రతీసారి వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు సకాలంలో జీతాలు అందుకున్న దాఖలాలు లేవు. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేదు. కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. తక్షణమే జీతాలు ఇవ్వాలి. – పిల్లి నాగరాజు, టీఏ, చుంచుపల్లి
జూలై నుంచి పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. జిల్లా అధికారులను అడిగితే వేతనాలు త్వరలో వస్తాయంటున్నారు. కనీసం దసరా పండుగలోపైనా ఇవ్వాలి.
– డి.అమర్నాథ్,
జీపీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు

ఎన్నాళ్లీ వేతన వెతలు?

ఎన్నాళ్లీ వేతన వెతలు?

ఎన్నాళ్లీ వేతన వెతలు?