
అర్హులకు అందేనా..?
● 2,22,587 దరఖాస్తులు.. 3,182 మంది అర్హులు ● మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ ● వార్డు మాజీ కౌన్సిలర్ల పెత్తనంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
కొత్తగూడెంఅర్బన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. కానీ, సర్వేలో జరుగుతున్న తప్పుల కారణంగా కొందరు అర్హులు ఇబ్బంది పడుతున్నారు. మండలాల్లో సర్వే పూర్తయి అర్హులను తేల్చినప్పటికీ.. మున్సిపాలిటీల్లో ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో గత జనవరిలో మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. కాగా, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో వార్డు మాజీ కౌన్సిలర్లు సభ్యులుగా ఉండటాన్ని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ నుంచి కమిటీ సభ్యులు ఉండడంతో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. దీంతో వార్డు ఆఫీసర్ ఎవరి మాట వినాలో తెలియక అవస్థ పడుతున్నారు. వార్డు మాజీ కౌన్సిలర్లు వారికి దగ్గరి వ్యక్తులు, బంధువులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు చెబుతున్నారు. పలు నిబంధనలు క్రమబద్ధీకరణ పట్టాలు లేని వారికి అవరోధంగా పరిణమించాయి. వర్షం కాలం వస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను సైతం కమిటీ సభ్యులు, వార్డు ఆఫీసర్లు అర్హత లేనివాటిగా గుర్తించడం రాజకీయ పెత్తనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అనర్హులు ఎవరు?
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రకటించినప్పడు ఆందోళన వ్యక్తమైంది. అలా గొడవలు జరుగకుండా కమిటీ సభ్యులు, వార్డు మాజీ కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు రహస్యంగా ఎంపిక చేస్తున్నారు. మొదటి దశ ఎల్–1లో స్థలం ఉండి ఇళ్లు లేని వారు, ఎల్–2లో స్థలం, ఇళ్లు లేని వారు అర్హులు. ఎల్–3లో కారు, సొంత ఇల్లు, దారిద్య్ర రేఖ ఎగువ ఉన్న వారిని చేర్చి అనర్హులుగా ప్రకటించాలి. కానీ, ఇక్కడే సభ్యులు, ఆఫీసర్ల మధ్య వ్యత్యాసాలు వస్తున్నాయి. గతంలో ప్రకటించిన ప్రకారం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తే.. వార్డుకు 5 నుంచి 10 మాత్రమే ఇళ్లు వస్తాయని, దశలవారీగా మంజూరు చేస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తులు ఇలా..
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 2,22,587 వరకు దరఖాస్తులు వచ్చాయి. అధికారులు తొలుత 22 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో 3,182 మందిని అర్హులుగా తేల్చి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీల్లో జరుగుతున్న సర్వేపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందని పలువురు చెబుతున్నారు.
మున్సిపాలిటీల్లో కొనసాగుతోంది..
జిల్లాలోని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయింది. 22 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశాం. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
– శంకర్, హౌసింగ్, పీడీ