ప్రతీ మనిషికి 100 లీటర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ మనిషికి 100 లీటర్లు

Published Sat, Mar 22 2025 12:08 AM | Last Updated on Sat, Mar 22 2025 12:07 AM

● వేసవిలోనూ సాఫీగా నీటి సరఫరా ● గతేడాదితో పోలిస్తే 20శాతం అధికంగా నీరు ● పైపులైన్‌ లేనిచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ● మిషన్‌ భగీరథ ఎస్‌ఈ గడ్డం శేఖర్‌రెడ్డి

ఖమ్మంవన్‌టౌన్‌: ఎండలు ముదురుతున్న నేపథ్యాన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తాగునీటికి ఇక్కట్లు ఎదురుకాకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించనున్నట్లు మిషన్‌ భగీరథ ఎస్‌ఈ గడ్డం శేఖర్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనూ నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా తమ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే సమాయత్తమయ్యారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం మంత్రి సీతక్క నేతృత్వాన హైదరా బాద్‌లో జరిగిన సమావేశంలో చేసిన సూచనల మేరకు గత నెలలోనే ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈగా ఖమ్మంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన వేసవి సన్నద్ధతపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్ల డించారు. అవి ఆయన మాటల్లోనే..

22గ్రామాలకు స్థానిక వనరులతో..

ఖమ్మం జిల్లాలో 931 గ్రామాలకు గాను ఏడు గ్రామాలకు మిషన్‌ భగీరధ పథకం ద్వారా కాకుండా స్థానిక వనరులతో నీరు అందిస్తున్నాం. అలాగే, భద్రాద్రి జిల్లాలోని 1,599 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో స్థానికంగానే నీరు సమకూరుస్తున్నాం.

వేసవికి ప్రత్యేక ప్రణాళిక

వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నెల రోజులు గా ప్రణాళికలు సిద్ధం చేశాం. గత నెలలోనే ఉద్యోగులంతా పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆయా ఆవాసాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోనున్నాం.

జోన్లుగా గ్రామాల విభజన

ఉమ్మడి జిల్లాలో ప్రతీ మనిషికి 100 లీటర్ల తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఈ స్థాయిలో నీరు అందుతున్న గ్రామాలను గ్రీన్‌ జోన్‌గా గుర్తించాం. ఇక 55 – 100 లీటర్లు అందించే గ్రామాలను ఆరెంజ్‌ జోన్‌గా, 20 – 55 లీటర్లు అందించే గ్రామాలను ఎల్లో జోన్‌గా, 20లీటర్ల కంటే తక్కువ సరఫరా అవుతున్న గ్రామాలను రెడ్‌జోన్‌గా విభజించాం. అయితే, గతేడాదితో పోలిస్తే ఇప్పటికై తే 20 శాతం నీరు అధికంగానే ఉంది. మిషన్‌ భగరథ పైప్‌లైన్‌ ఉన్న గ్రామాలకు గ్రిడ్‌ ద్వారా, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం.

మారుమూల పల్లెలకు సైతం..

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోనూ ఇప్పటికే స్థానికంగా ఉన్న వనరుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. ఆదివాసీ గూడేల్లో సైతం బోర్లు వేసి సోలార్‌ ప్యానళ్ల ద్వారా నిరంతరాయంగా నీరు అందిస్తున్నాం.

ప్రతీ మనిషికి 100 లీటర్లు1
1/1

ప్రతీ మనిషికి 100 లీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement