కర్లపాలెం: ఆటోను పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొనటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన చెరుకుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్లపాలెం మండలం చింతాయపాలేనికి చెందిన ఆటో చెరుకుపల్లి వెళుతుండగా పెట్రోల్ బంక్ల వద్ద పశు సంవర్ధక శాఖకు చెందిన పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులలో తోట పద్మావతి(50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ ఏనుగు పోలీస్రావు, తన్నీరు కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పెదమల్లు వెంకటరావు, పెదమల్లు శివకుమారి, తోట దుర్గ, యాజలి సాంబయ్య స్వల్పంగా గాయపడ్డారు. వీరందరూ బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతురాలు తోట పద్మావతి కుమార్తె, పసుపులేటి కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెరుకుపల్లి ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన కోన..
ఆటో ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ సైనికుడు తోట వెంకటరమణ భార్య పద్మావతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఏరియా వైద్యశాలకు వెళ్లి పద్మావతి మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటరమణను ఓదార్చారు. గాయాలైన వారిని పరామర్శించారు.
గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, పాల్గొన్నారు.


