రేపల్లె: రేపల్లె మండలం రావి అనంతవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పంట కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు కాలువలో ఈతకు దిగగా వారిలో ఒకరికి ఈత రాకపోవడంతో అకస్మాత్తుగా మునిగిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. తర్వాత స్థానికులు గమనించి కాలువలో మునిగిపోయిన యువకుడిని బయటికి తీసేసరికి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండవచ్చని పట్టణ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటివరకు మృతుని ఆచూకీ తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పెనుమూడి వీఆర్వో జొన్న రామస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు.


