వేమూరు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపమైంది. కాల్వల్లోకి నీరు అధికంగా విడుదల చేయడంతో పాటు, కాల్వలు మరమ్మతులు చేయకపోవడం, గుర్రపు డెక్క తొలగించకపోవడం వంటి కారణాలతో నీరు పొంగిపొర్లి పంటపొలాల్లో నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. చుండూరు మండలంలోని తుంగభద్ర సైడ్ చానల్కు అధికారులు తాగు నీరు విడదల చేశారు. తుంగ భద్ర సైడ్ చానల్లోని కట్టలు బలహీనంగా ఉండటం, వంతెనల వద్ద తూటి కాడ నిలిచి పోవడంతో నీరు పారుదల కాకపోవడంతో నీరు నడిగడ్డవారిపాలెం పొలాల్లోకి చేరింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పొలం గట్ల నుంచి నీరు పొర్లి పక్కనే ఉన్న జగనన్న కాలనీలోకి సైతం వెళ్లి కాలనీ జలమయమయింది. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు కల్పించుకుని దుండిపాలెం గ్రామం వద్ద కోతకు గురైన కాల్వ కట్ట మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా కాల్వలో గుర్రపుడెక్క, వ్యర్థాలు తొలగించాలని రైతులు కోరారు.
● ఘటనపై ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీరు రవీంద్రను వివరణ కోరగా.. దిగువ ప్రాంతాలకు తాగు నీరు అధికంగా విడుదల చేయడంతో చుండూరు మండలంలోని పొల్లాలోకి, జగనన్న కాలనీకి నీరు వెళ్లినమాట వాస్తవమేనని, తాగునీరు విడుదల తగ్గించడం జరిగిందని తెలిపారు.


