ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య వదంతులను, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వాటిని వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫామ్స్పై వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేలా సందేశాలు పంపడం, ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి షేర్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సమాజంలోని ప్రజల మధ్య సామరస్యం పెంపొందాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ ఇతరుల మనోభావాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్ అడ్మినన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ గ్రూపుల్లో ఎవరైనా అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేస్తే, అడ్మినన్లు వెంటనే స్పందించి ఆ సందేశాలను తొలగించడంతో పాటు సంబంధిత వ్యక్తులను గ్రూప్ నుంచి తొలగించాలన్నారు. లేనిపక్షంలో, గ్రూప్లో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా అసత్య ప్రచారాలు, వర్గాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గమనిస్తే, వెంటనే దగ్గరలోని పోలీసులకు, 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.


