యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
రేపల్లె: మండలంలోని గుడ్డికాయలంక వద్ద ఇసుకపల్లి చానల్ కట్టకు శనివారం గండి పడింది. ప్రస్తుతం తాగునీటి చెరువులకు నీరు నింపుకునే నిమిత్తం కాల్వకు నీరు వదలడంతో బలహీనంగా మారిన కాల్వకట్టకు గండిపడింది. సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గండి పడిన స్థలాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పడిన ప్రాంతంలో కట్టకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇసుకబస్తాలతో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చి కాల్వకట్టను బలపరిచారు. గండిపడిన ప్రాంతంలో నీరు సమీపంలోని పొలాలలోకి చేరినప్పటికి సాగుభూమిలో ఎటువంటి పైరులేకపోవటంతో నష్టం తప్పింది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్లు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రానున్న ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని బలహీనంగా ఉన్న కట్టలను పరిశీలించి బలపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.80 అడుగులకు చేరింది. ఇది 158.1740 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


