కొల్లూరు: పదో తరగతి ఫలితాలలో గ్రామీణ ప్రాంతానికి చెందిన దివ్య తేజ ప్రకాశించింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంకకు చెందిన భావిరెడ్డి హరిప్రసాద్ కుమార్తె దివ్య తేజశ్రీ గురువారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో 596 మార్కులు సాధించింది. కొల్లూరులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసించిన బాలిక తొలి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. విద్యార్థినిలో ఉన్న ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక తోడ్పాటు అందించారు. పొలం పనులతో తలమునకలయ్యే తండ్రి.. ఇంటి పనులలో మమేకయ్యే తల్లి కూతురికి ప్రోత్సాహం అందించడంతో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించడానికి దోహదపడింది. స్వగ్రామమైన గాజుల్లంక నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. ఉపాధ్యాయ బృందంతోపాటు పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు తోడ్పాటే విజయానికి కారణమని విద్యార్థిని తెలిపింది. ఐఐఐటీ పూర్తి చేయడంతోపాటు, సివిల్స్ సాధించడమే లక్ష్యమని పేర్కొంది.


