ప్రకృతి వ్యవసాయం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రామచంద్రం
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయం మోడల్స్తో వర్షాభావ పరిస్థితుల(ఎల్నిలో)ను అధిగమించవచ్చని ప్రకృతి వ్యవసాయం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రామంద్రం పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై కృషి భవన్లో ఏడీఏలు, ఏఓలు, ఉద్యాన శాఖ అధికారులు, ఏపీఎంలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ ఎల్నిలోను ఎదుర్కోవడానికి పీఎండీఎస్ విత్తనాలు, విత్తన గులికల ప్రక్రియతో 365 రోజులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా జేడీఏ ఎం.పద్మావతి మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు తమ మండలాల్లో పీఎండీఎస్ కిట్స్ విత్తనాలను రైతులు అందరితో విత్తు చేయించే దిశగా కృషి చేయాలన్నారు. ఆత్మ ప్రాజెక్టు మేనేజర్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు సమర్ధవంతగా నిర్వహించారని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి మాట్లాడుతూ 30 రకాల విత్తనాలతో పీఎండీఎస్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ ఇచ్చిన టార్గెట్స్ పూర్తి చేయాలనాఇ కోరారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ ఎల్హెచ్ అశోక్, పలువురు ఏడీఏలు, ఏఓలు, ఉద్యాన శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి కేసులో నిందితులకు రిమాండ్
నరసరావుపేట టౌన్: పట్టణ శివారు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్న కేసులో నిందితులైన పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జకీర్, నితిన్ సాయి, అమర్నాథ్, హర్షవర్ధన్, గోపీనాథ్, అబ్దుల్ అజీజ్ లకు రిమాండ్ విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31వ తేదీన నిందితులు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ పోలీసులు దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.


