గుంటూరు మెడికల్: క్యాన్సర్ వ్యాధి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆరోగ్య సమస్యగా పరిణమించిందని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న మూడు నెలల హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా (సర్వయికల్) క్యాన్సర్ భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆరోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. దీని నివారణకు సురక్షితమైన హెచ్పీవీ వ్యాక్సిన్ను 14 సంవత్సరముల ఆడపిల్లలకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. అర్హత గల వారు తమ పేర్లు యు–విన్ పోర్టర్ లో నమోదు చేసుకొని, వ్యాక్సిన్ వేయించుకొని సర్టిఫికెట్ పొందవచ్చని చెప్పారు. వ్యాక్సిన్ రక్షణకు ఒక అవకాశం అని, సంరక్షణ కోసం ఒక దశ అని తెలిపారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అర్హులైన 14,167 మందికి గాను ఇప్పటివరకు 2601 మందికి అంటే 18.36 శాతం వ్యాక్సిన్ అందజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఈ వాక్సినేషన్ను వేగవంతం చేయాలన్నారు. మరింత సమాచారం కోసం దగ్గరలోని సచివాలయం ఆరోగ్య కార్యకర్తను, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.


