గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 2023 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉండగా 1608 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ప్రస్తుత బార్ అధ్యక్షుడు యంగలశెట్టి శివ సూర్యనారాయణ వ్యవహరించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, జి.శాంత కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి 9 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంత సమయం అయినప్పటికీ రాత్రికి ఫలితాలు వెల్లడిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు..
చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.


