కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మోపిదేవి శ్రీనివాసరావు
రేపల్లె: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన అరుదైన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు నేతృత్వంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీసుకుంటున్న నిర్ణయాలు వైఎస్సార్ కుటుంబానికి తీరని నష్టం చేకూరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేవలం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు సారథ్యంలో విమర్శలు చేయడం తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జనసేన అధినేత పవన్కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మెగా ఫ్యామిలీని రాజకీయంగా దుష్ప్రచారం చేసింది టీడీపీ నాయకులేనని పవన్కళ్యాణ్ మర్చిపోవడం బాధాకరమన్నారు. వంగవీటి మోహనరంగా వంటి నేతల పోరాట స్ఫూర్తితో వైఎస్సార్ చూపిన మార్గంలోనే వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్లు బేతపూడి కోటేశ్వరరావు, రెడ్డి శివశంకర్, నీలా లక్ష్మణ్బాబు పాల్గొన్నారు.


