బాపట్ల: నిరుద్యోగ యువకులతో చంద్రబాబునాయుడు సర్కారు మరోసారి ఆటలాడుకుంటోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య ధ్వజమెత్తారు. నిరుద్యోగభృతి, జాబ్క్యాలెండర్లో స్పష్టత లేదంటూ సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్రం మొత్తం తిరిగి యువకులకు హామీలు ఇచ్చి మొండిచేయి చూపారని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి వస్తోందని నమ్మిన యువకులు ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతే ఆ ఊసేలేకుండా పోయిందని చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటూ స్పష్టతలేని హామీలతో మరోసారి యువతను ముంచేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. యువతకు మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
జగనన్న పాలనలోనే
యువతకు న్యాయం..
జగనన్న పాలనలోనే యువతకు రాష్ట్రంలో న్యాయం జరిగిందని మేరుగ చందనాగ్ పేర్కొన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సచివాలయ వ్యవస్థను రూపొందించి 1.46 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. యువతకు ఉద్యోగాలతోపాటు సంక్షేమాన్ని అందించిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారని వివరించారు.
పాలనలో పారదర్శకత ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్క వీరారెడ్డి, రాష్ట్రకార్యదర్శి దొంతిబోయిన జై భారత్ రెడ్డి, నాయకులు నీలం వీరేంద్ర, జెల్లీ జోషి కాంత్, శీలం చంటి, దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, ఎరిపల్లి కోదండ వడ్డీముక్కల రవితేజ, ఐల ఏసుబాబు, షేక్ అక్రమ్, ఎస్.మురళి పాల్గొన్నారు.
యువజన విభాగం
జిల్లా అధ్యక్షులు చెంచయ్య


