చెరుకుపల్లి: ప్రతి విద్యార్థిని తోటి విద్యార్థినులతో స్నేహ భావంతో మెలుగుతూ ఆరోగ్యకర వాతావరణంలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు బిట్రా జయంతి, జి.నాగలక్ష్మీ అన్నారు. మండలంలోని కావూరు బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్నేహం, ఆరోగ్యకరమైన దిన చర్య పాటిస్తూ తోటి విద్యార్థుల పట్ల స్నేహ పూర్వకంగా పరస్పర గౌరవంతో మెలుగుతూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా దానిని ఎలా అధిగమించాలి, భావోద్యేగ నియంత్రణను ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వివరిస్తూ విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.విజయలక్ష్మి, పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కెరీర్ గైడెన్స్,
మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు జయంతి, నాగలక్ష్మి


