వేటపాలెం: మండల పరిధిలోని జగనన్న కాలనీల్లో పక్కా గృహాల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీ పక్కనే ఉన్న జగనన్న కాలనీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వమే నిధులు ఇస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై ఆరా తీశారు. ఉగాది నాటికి రెండున్నర లక్షల గృహ ప్రవేశాలు జరపాలని ముఖ్య మంత్రి సూచనలను లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 6,481 పక్కా గృహాలు నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు పురోగతి లేకపోవడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యం గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. చేనేతపురి కాలనీ పక్కన 254 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 181 గృహాలు నిర్మాణం మాత్రమే పూర్తికాగా .. ఇంకా మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోవడంపై పరిశీలించారు. కాలనీ వాసులు తమకు తాగునీరు రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తే మరి కొంత మంది ఇక్కడ నివాసం ఉంటారని ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. పైప్లైన్లు దెబ్బతినడం వల్ల నీళ్లు రావడం లేదని సంబంధిత ఏఈ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఓ టి. చంద్రశేఖర్ నాయుడు, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
రిసార్ట్స్కు ర్యాంకింగ్
స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్లో భాగంగా తీర ప్రాంతంలోని రిసార్ట్స్కు ర్యాంకింగ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు తీరుపై తీర ప్రాంత మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ (పర్యావరణానికి హాని లేకుండా చేసే పారిశుద్ధ్య వ్యవస్థ) అమల్లోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థ అమలు తీరుపై గత నెలలో ఆయా శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రస్తుతం బాపట్ల జిల్లా పదో స్థానానికి చేరిందన్నారు. మరికొన్నింటిలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ క్రమంలో సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ ప్రాంతాలన్నీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలోని 57 రిసార్ట్స్లు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, డీఎల్డీవోలు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్


