నగరంపాలెం: గుంటూరు, పల్నాడు జిల్లాలలో వాణిజ్య అవసరాలకు గృహావసరాల ఎల్పీజీ సిలెండర్లను అక్రమంగా వాడే దుకాణాలు, హోటళ్లపై గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కట్టమూరి వారి వీధిలోని స్వీట్ షాప్లో తనిఖీ చేయగా, యాజమాని ఐదు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నరసరావుపేట రోడ్లో ఐదు, గుంటూరు నగరంలోని లిబర్టీ సెంటర్లో బిర్యానీ హోటల్లో మూడు, ఓ కిచిడీ పాయింట్లో మూడు, ఆటోనగర్ ఇందిరానగర్ హోటల్లో ఐదు, కిచిడీ పాయింట్లో ఐదు సిలెండర్లను గుర్తించి స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 26 గృహ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లను సీజ్ చేసి, స్థానిక సీఎస్డీటీలకు అప్పగించారు.కేసులు నమోదు చేశారు. గుంటూరు ప్రాంతీయ విజిలెనన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలి రూరల్: భార్యను హత్య చేస్తానని బెదిరిస్తున్న రౌడీషీటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్ సుద్దపల్లి రాజేంద్ర కొంత కాలం క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపుల కారణంగా భార్య మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి పెట్రోలు సీసా తీసుకెళ్లి చంపేస్తానని భార్య, ఆమె కుటుంబసభ్యులను రాజేంద్ర బెదిరిస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ గురువారం తెలిపారు. ఇదే రౌడీషీటర్ గతేడాది అక్టోబరులో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వద్ద ఏడాది కాలానికి రూ. ఐదు లక్షలకు సెల్ఫ్ బాండ్ తీసుకుని, ఏవిధమైన ఘర్షణలు, నేరాల్లో పాల్గొనని బైండోవర్ అయ్యాడు. తీరు మారకపోవడంతో అరెస్ట్ చేశామని, అలానే అతని నుంచి రూ. ఐదు లక్షల నగదు రికవరీ చేస్తామని వివరించారు.
గుంటూరు ఇంజినీర్కు గుర్తింపు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరుకు చెందిన యువ ఇంజినీర్ ఆకెళ్ళ నరసింహ సాయినాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో డైమెన్షనల్ ఇంజినీరింగ్ రంగంలో గణనీయమైన ముద్ర వేసిన కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత హూస్టన్లోని టెస్లా సంస్థ నుంచి ఆఫర్ అందుకున్నారు. గుంటూరులో పుట్టి పెరిగిన సాయినాథ్ తన పాఠశాల విద్యను బ్రాడీపేటలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి మండలంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన సాయినాథ్, గత దశాబ్దంలో అత్యంత సమర్థుడైన డైమెన్షనల్ ఇంజినీర్గా ఎదిగారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఏఎస్ఎంఈ), జీడీ అండ్ టీ, సీనియర్ లెవల్ సర్టిఫికేషన్ పొందారు.


