మచిలీపట్నంఅర్బన్: విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఒకేషనల్ విద్య దోహదపడుతుందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. కృష్ణవేణి ఐటీఐ కళాశాలలో ఒకేషనల్ విద్యకు సంబంధించి గురువారం ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేషనల్ విద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.సీతామహాలక్ష్మి, ఏపీఓ కె.ఏడుకొండలు, ఏఎంఓ శ్యామ్, ఎంఐఎస్ సుభాన్, సీఎంఓ టి.రమేష్, వీసీఎస్ జి.పద్మజ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు.


