జాతీయ రహదారిపై నాగులపాలెం గ్రామస్తుల నిరసన అధికారులు జోక్యంతో నిరసన విరమణ
పర్చూరు(చినగంజాం): వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై మండలంలోని నాగులపాలెం గ్రామానికి చెందిన ప్రజలు మంగళవారం రహదారి నిర్మాణంతో తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించాలంటూ రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాహనాలను అడ్డుకొని తీరతామని వారంతా ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణం చేయటం ద్వారా నాగులపాలెం గ్రామానికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. తమ గ్రామానికి జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకపోతే వర్షాకాలంలో వరద ముంపు వల్ల గ్రామంతోపాటు తమ పొలాలు మునిగిపోయే ప్రమాదముందని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి జాతీయ రహదారితో అనుసంధానిస్తూ సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకుంటే గ్రామ ప్రజలు, విద్యార్థులు కిలోమీటర్ల మేర నడచి వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నిలిచిన ట్రాఫిక్..
గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోయింది. అధికారులు వచ్చి సమస్యను పరిష్కారమార్గం చూపే వరకు నిరసన విరమింపబోమని రైతులు, ప్రజలు స్పష్టం చేశారు. స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి వచ్చి రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడారు. అధికారులు ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ జగదీష్ నాయక్, తహసీల్దార్ బ్రహ్మయ్యలు అక్కడకు చేరుకొని రైతులకో సర్వీసు రోడ్డు చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ ఏర్పాటుకు సత్వరం చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 20 కి.మీలోపు వాహనాలు కలిగిన వారికి నెలవారి పాసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, రైతులు నిరసన విరమించారు.


