పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణ రేపల్లె–తెనాలి రోడ్డుపై వాహనాలను అడ్డగించి ఆత్మహత్యాయత్నం
ఆరోపణలలో అవాస్తవం
పెట్రోల్ పోసుకొని
కొల్లూరు: ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు గౌడపాలెం ప్రాంతానికి చెందిన గరిక గోపాలంకు గతంలో ఆయన ఇంటి పక్కన నివసించే కుటుంబంతో ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో గోపాలంపై దాడి జరగడంతో కొల్లూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులు సోమవారం తనను దూషిస్తున్నారంటూ గోపాలం భార్య కొల్లూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గోపాలం సోదరుడు వెంకయ్య తెనాలి–రేపల్లె రోడ్డుపై ఆందోళనకు దిగాడు. రోడ్డుపై దుంగలను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డగించాడు. ఆర్టీసీ బస్సు ఎదురుగా పడుకొని నిరసన చేపట్టడంతోపాటు, తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతని కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకొని అతనిపై నీళ్లు పోయడంతోపాటు, రోడ్డుకు అడ్డుగా వేసిన దుంగలను తొలగించడంతో, వాహనాల రాకపోకలు కొనసాగాయి.
పోలీసులు కేసు విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదు. గతంలో స్థలం విషయంలో గోపాలంపై జరిగిన దాడిపై కేసు నమోదు చేయడం జరిగింది. సోమవారం తమను దాడి చేసిన నిందితుని కుటుంబ సభ్యులు తిడుతున్నారని ఫిర్యాదు చేయడంతో సిబ్బంది వారిని పిలిచి హెచ్చరించి పంపడం జరిగింది.
– పి.కోటేశ్వరరావు, ఎస్ఐ, కొల్లూరు


