సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అరూప్ ఘోష్ సముద్రపు మొక్కల సాగు యూనిట్ను సందర్శించిన కేంద్ర బృందం
చినగంజాం: మత్స్యకార మహిళలకు సముద్రపు మొక్కల సాగు మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అరూప్ ఘోష్ అన్నారు. మండలంలోని పెదగంజాం పంచాయతీ ఏటిమొగ గ్రామంలో నిర్వహిస్తున్న సముద్రపు మొక్కల సాగు యూనిట్ను కేంద్ర బృందం సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార మహిళలకు సముద్రపు మొక్కల సాగు ఆదాయ వనరుగానే కాక తీరంలో సాగు చేయడం వల్ల సముద్ర జీవరాశుల మనుగడకు ఆధారం అవుతుందన్నారు. తీరంలో సాగు చేపట్టిన ఎకో వేవ్ ఓషానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ కొమ్మిరెడ్డి మాధవి వెంకటేశ్వరరెడ్డిని వారు అభినందించారు. మహిళా పారిశ్రామిక వేత్తగా సముద్ర మొక్కల పెంపకం సాగులో ముందడుగు వేసిన ఆమెను ప్రశంసిస్తూ త్వరలో చీరాల ఓడరేవు, కొత్త ఓడరేవు గ్రామంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న సముద్రపు మొక్కల పెంపకం యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరాల ఐటీసీ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ వి. వినోద్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి సముద్రపు మొక్కల పెంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతిని సాగు విధివిధానాలను కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ లక్కాకుల సతీష్, బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్, డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్ గాలి దేవుడు, మత్స్యశాఖాధికారి రవీంద్ర స్థానిక మత్స్యకార రైతులు పాల్గొన్నారు.


