
మా ఆత్మగౌరవాన్ని కాపాడండి !
పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
– నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ,
వార్డు సచివాలయ కన్వీనర్
సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు.
– దీప్తి, మహిళా పోలీస్