
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేది లేదని తేల్చి చెప్పిన ఎంపీటీసీ సభ్యులు
పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది.