
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీఆర్వో జి. గంగాధర్గౌడ్
బాపట్ల టౌన్: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్వో జి. గంగాధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను విన్నవించారని తెలిపారు. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కార చూపామని పేర్కొన్నారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారణకు ఆదేశించామని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి 164 మంది ఫిర్యాదుదారులు వచ్చినట్లు తెలిపారు.
తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదు
పీజీఆర్ఎస్ లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 14,458 అర్జీలు నమోదు అయ్యాయని, వాటిని ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించామని వెల్లడించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్త పాటించాలని డీఆర్వో తెలిపారు. స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. అందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో సచివాలయాల స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వర్షాలు కురుస్తున్నందున కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్. విజయమ్మ పాల్గొన్నారు.
స్మార్ట్ న్యూ రైస్ కార్డుల ద్వారానే బియ్యం పంపిణీ జరుగుతుందని డీఆర్వో జి. గంగాధర్గౌడ్ తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ స్మార్ట్ న్యూ రైస్ కార్డులను ప్రజల ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. జిల్లాలోని 1,123 చౌక ధరల దుకాణాల పరిధిలో 4,71,382 రైస్ కార్డులు ఉన్నాయన్నారు. పాత కార్డులకు బదులుగా వాటి స్థానంలో స్మార్ట్ న్యూ రైస్ కార్డులను ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. 15వ తేదీ నుంచి పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. జిల్లాకు 4.71 లక్షల కార్డులు వచ్చాయని, సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి పంపిణీ చేస్తారని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు పర్యవేక్షించాలని డీఆర్వో ఆదేశించారు. వీటి వినియోగం కోసం ఈ–పాస్ యంత్రాలను ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
పశువులకు గాలికుంటు వ్యాధుల టీకాలు
జిల్లాలోని పశువులకు గాలి కుంటు వ్యాధుల టీకాల కార్యక్రమం ఈనెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని డీఆర్వో గంగాధర్ గౌడ్ తెలిపారు. పశు వైద్యశాఖ రూపొందించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు.