
మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తూట్లు
రేపల్లె: ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు షేక్ నసీరున్నీసా బేగ్ విమర్శించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని, మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు చేస్తామని, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేపడతామని ఎన్నికల ముందు ఊకదంపుడు హామీలు ఇచ్చిన కూటమి నాయకులు నేడు హామీల అమలులో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు.
● నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ. 100 కోట్లు కేటాయింపు చేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారని, ఇమామ్లకు ప్రతి నెల రూ. 10,000 మౌజన్లకు రూ. 5000 గౌరవ వేతనం అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించి మసీదుల నిర్వహణకు ప్రతినెల రూ. 5000 ఆర్థిక సాయం అందిస్తామని కల్లబొల్లి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల గడుస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చెయ్యకుండా ముస్లిం మైనారిటీలను దగా చేశారన్నారు. ఇప్పటికై నా మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 8న జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్
జిల్లా అధ్యక్షురాలు షేక్ నసీరున్నీసా బేగ్