కారెంపూడి: గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ఎనిమిది లారీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేసి సరైన బిల్లులు లేకపోవడంతో వాటిని కారెంపూడి పోలీస్స్టేషన్ అధికారులకు ఆదివారం రాత్రి అప్పగించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి గ్రానైట్తో లారీలు మహారాష్ట్రకు వెళ్తున్నాయి. వాటిలో సరుకు విలువను బట్టి ఒక్కొక్క లారీకి రూ.2.5 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నరసరావుపేట రహదారిలో జూలకల్లు సమీపంలోను, కారెంపూడి సమీపంలోను కొన్ని లారీలను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జీజీహెచ్లో నకిలీ డాక్టర్ హల్చల్
పోలీసులకు పట్టించిన సూపరింటెండెంట్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగంలో డాక్టర్ మాదిరిగా ఓ మహిళ యాప్రాన్, సెతస్కోప్ ధరించి చికిత్సలు చేసేందుకు హడావుడి చేయడంతో పట్టుపడిపోయింది. గుంటూరుకు చెందిన జ్యోతి గతంలో పిల్లల విభాగంలో తన పిల్లలకు చికిత్స చేయించేందుకు కొన్ని రోజులపాటు ఉంది. రెండు రోజులుగా ఆసుపత్రిలో డాక్టర్ మాదిరిగా రౌండ్స్ వేస్తూ పిల్లలకు చికిత్స చేసేందుకు హడావుడి చేస్తుండటంతో వార్డుల్లో తనిఖీలు చేస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఆమో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తక్షణమే పోలీసులకు అప్పజెప్పారు. ఆమె వెంట మరో వ్యక్తి ఉండి అచ్చం డాక్టర్ మాదిరిగా వార్డులో హడావుడి చేస్తున్నాడని, ఆకృత్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండటంతో తక్షణమే పోలీసులకు అప్పగించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
రూ.లక్షల్లో యూనివర్సిటీ ఫీజులు
మంగళగిరి టౌన్: అమరావతి రాజధాని పరిధిలో వున్న పలు యూనివర్సిటీల్లో ఫీజులు రూ.లక్షల్లో ఉంటున్నాయని, కానీ వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయని, పేరు గొప్ప.. ఊరు దిబ్బగా అవి ఉంటున్నాయని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఎద్దేవా చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం రాత్రి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. నేతాజీ మాట్లాడుతూ అమరావతి రాజధాని పరిధిలో విట్, ఎస్ఆర్ఎం, ఇతర యూనివర్సిటీలలో విద్యార్థులు రూ.లక్షలు ఫీజులు చెల్లించి చదువుకుంటున్నారని, వారికి మాత్రం నాణ్యత లేని అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారని విమర్శించారు.
15 రోజుల క్రితం విట్ యూనివర్సిటీలో ఆహారం సరిగా లేదంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారని, అది మరువక ముందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడం యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆహార పదార్థాలను తనిఖీ చేసే అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పూలింగ్ చట్టంలో ఉన్న విధంగా రాజధానిలో నిర్మించిన విశ్వవిద్యాలయాల్లో ఆ ప్రాంత విద్యార్థులకు రాయితీలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా ఆయా యూనివర్సిటీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేతాజీ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, పట్టణ కార్యదర్శి వీవీ జవహల్ లాల్, సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కమలాకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

గ్రానైట్ లారీలు స్వాధీనం