
వైభవంగా నూతలపాడు పోలేరమ్మ తిరునాళ్ల
పర్చూరు(చినగంజాం): మండలంలోని నూతలపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి 55వ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంట చేతికి అందిన తరువాత గ్రామంలో తిరునాళ్ల నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తిరునాళ్లను పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలివచ్చి పోలేరమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతర కార్యక్రమంలో శిడిమాను ఉత్సవం, శిడి పెళ్లి కొడుకు కార్యక్రమం విశేషతను సంతరించుకొంది. మేకపోతును పూజించి అమ్మవారిని ఆవహింపజేసిన మేకపోతును ఊయల పెట్టెలో ఉంచి శిడిమానుకు వేలాడ తీయడం సంప్రదాయంగా వస్తుంది. శిడిమానుకు రైతులు పండించిన వరి, మిరప, మొక్కజొన్న కుంకులను వేలాడదీసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం శిడిమానుని అమ్మవారి ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి యువకుల కేరింతల నడుమ గ్రామోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. శిడిమాను బండిని లాగితే కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసంతో భక్తులు, యువకులు, చిన్నారులు, మహిళలు సైతం ఎంతో ఉత్సాహంగా గ్రామోత్సవంలో పాల్గొన్నారు. యువకులు చేసిన కేరింతలు, నృత్యాలు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి. తిరుణాళ్ల సందర్భంగా మజ్జిగ, పులిహోర, అన్నదాన కార్యక్రమాలను దాతలు ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో పర్చూరు ఇన్చార్జ్ సీఐ శేషగిరిరావు, ముగ్గులు ఎస్ఐలు, 50 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
చలివేంద్రం ఏర్పాటుచేసిన రోటరీ క్లబ్
నూతలపాడు పోలేరమ్మ ఆలయం వద్ద తిరునాళ్లను పురస్కరించుకొని భక్తుల కోసం ప్రతి సంవత్సరం మాదిరిగానే పర్చూరు రోటరీ క్లబ్ సెంట్రల్, సపోర్ట్ సహకారంతో భక్తులకు వేసవిలో ఇబ్బంది కలుగకుండా మంచినీటి చలివేంద్రాన్ని గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త విన్నకోట రవికుమార్ ప్రారంభించారు. పోలూరి శివారెడ్డి, గ్రామస్తులు పాల్గొనగా రోటరీ క్లబ్ అద్యక్ష, కార్యదర్శులు తోకల కృష్ణమోహన్, కోమటి ఆంజనేయులు, సపోర్ట్ అధ్యక్ష, కార్యదర్శులు నాగబైరు శ్రీనివాసరావు, పంబి సదానందరెడ్డి, సభ్యులు భవనం రాజగోపాల్రెడ్డి, పాల్గన్నారు, భక్తులకు విన్నకోట రవి మంచినీటిని అందజేశారు.

వైభవంగా నూతలపాడు పోలేరమ్మ తిరునాళ్ల