మదనపల్లె టౌన్ : పట్టణంలోని సీటీఎం రోడ్డు శివాజీనగర్ లో గురువారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు కిరణ్ కుమార్, అంజి, సాయిప్రసాద్ లు వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా, మార్గంలో చెట్లు అడ్డుగా ఉండటంతో ఓ వీధిలోకి వెళ్లలేకపోయారు. ఈ విషయమై చిరంజీవి అనే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన చిరంజీవి తన అనుచరులతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


