పుంగనూరు: మున్సిపాలిటీ పరిధిలోని నగరివీధిలో గల యూపీ స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఫుడ్సేఫ్టి ఇన్స్పెక్టర్ గురులక్ష్మీ తనిఖీ చేశారు. బుధవారం సాంబారులో బల్లి రావడం పాఠకులకు విధితమే. దీనిపై ఆమె పాఠశాలను, వంట గదిని, సరుకులతో పాటు నూనెలు, శుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించి విచారణ చేశామని, వైద్యుల రిపోర్టును పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కడప అర్బన్: వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్’కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో రాచకుంట మేఘశ్యామ్ (24) గురువారం విష ద్రావణం తాగడంతోపాటు, బ్లేడుతో గొంతును కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిన రిమ్స్కు తరలించారు. ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం మేరకు పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన రాచకుంట జయశంకర్ కుమారుడు రాచకుంట మేఘశ్యామ్(24) అదే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం మంచిది కాదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలుమార్లు మేఘశ్యాంకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాక వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇదే అంశంపై పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదులు చేసుకోవడంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వివాహితను, ఆమె పిల్లలను తన తల్లిదండ్రులు, బంధువులు దాచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ యువడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారస్థితిలో, వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో బాధితుడు రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ కార్యాలయంలో విధుల్లో వున్న కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు యువకుడు మేఘశ్యాంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప వన్టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య తెలియజేశారు.


