రామాపురం: మండలంలోని రాయచోటి వేంపల్లి రహదారి మార్గంలో ఉండే ఏకిలపల్లి క్వారీలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. రాయచోటి మాసాపేటకు చెందిన జాబీద్ పదోతరగతి అనే 10వ తరగతి విద్యార్థి పరీక్ష అనంతరం తోటి విద్యార్థులతో కలసి ఈతకు వెళ్లాడు. తర్వాత అతని ఆచూకీ తెలియలేదు.లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. జాబీద్ కనిపించకపోవడతో తల్లిదండ్రులు,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని బండ్లపెంట సమీపంలో సుమారు 65–70 మధ్య వయస్సు ఉన్న పురుషుడి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ బివి చలపతి తన సబ్బందితో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే తమకు . 9121100559/ 9121100560/ 9121100561 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు.
మహిళతో అసభ్య ప్రవర్తన
– యువకుడికి దేహశుద్ధి
పుంగనూరు: ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని, అతనికి చెప్పుల దండ వేసి, దేహశుద్ధి చేసి ఊరేగింపు చేసిన సంఘటన పుంగనూరులో మంగళవారం జరిగింది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు రావడంతో ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణ
– ముగ్గురికి గాయాలు
రొంపిచెర్ల: పాత కక్షలతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ముగ్గురు గాయపడిన సంఘటన రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గాజులపల్లెలో మంగళవారం రాత్రి జరిగింది. గాజులపల్లెకు చెందిన ప్రభాకర్కు ఈశ్వరయ్య, చంద్రయ్యకు పాత కక్షలు ఉన్నాయి. ఇరువర్గాల వారు రొంపిచెర్ల పోలీసుస్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారు. అయితే మంగళవారం రాత్రి ప్రభాకర్ రొంపిచెర్ల నుంచి ఇంటికి వెళుతుండగా అడ్డగించి దాడి చేశారని ఫిర్యాదు ఇచ్చారు. అదే విధంగా ఈశ్వరయ్య, చంద్రయ్య తమ ఇళ్లపై దాడి చేసి గాయ పరిచారని ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో చంద్రయ్య తలకు గాయమైంది అలాగే ఈశ్వరయ్యకు కూడా చేతి వేలుకు గాయమైంది. ఇద్దరు పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


