రొంపిచెర్ల: తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్లో చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంకు చెందిన ఒక కారు బుధవారం మధ్యాహ్నం కాలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత దాసరిగుడెంకు చెందిన వెంకటేష్ ఏపీ10 ఏవై1978 స్కోడా కారు ఉంది. వెంకటేష్ బతుకు దెరువు కోసం కువైట్కు వెళ్లారు. అయితే కారు మరమ్మతులకు గురి కావడంతో మూడు రోజుల క్రితం సర్వీసింగ్ చేయాలని వెంకటేష్ కుమారుడు విష్ణువర్ధన్ (16), కారు డ్రైవర్ రామయ్యతో కలసి తిరుపతికి తీసుకెళ్లి బాగు చేయించారు. తిరిగి బుధవారం స్వగ్రామం రొంపిచెర్లకు వెళుతుండగా భాకరాపేట ఘాట్ రోడ్డులో కారు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. వెనక వస్తున్న వాహనదారులు గమనించి కారు డ్రైవర్ రామయ్యకు చెప్పారు. దీంతో ఇద్దరు కారు నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డారు.కారు కాలి బుడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భాకరాపేట ఎస్ఐ కృష్ణయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొలేరో వాహనం..
పెద్దతిప్పసముద్రం: మండలంలోని రంగసముద్రం పంచాయతీ తోటవారిపల్లికి చెందిన మహేష్ అనే వ్యక్తి బొలేరో వాహనం బుధవారం ప్రమాదవశాత్తు దగ్ధం అయింది. సదరు వ్యక్తి డ్రిప్ పరికరాలను వాహనంలో ఉంచి పొలం పనులు చేసుకుంటున్నాడు. ఈ తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు సమీప పొలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించేందుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా ఎగసి పడటంతో అక్కడ నిలిపి ఉన్న బొలేరో వాహనంతో పాటు అందులో ఉన్న డ్రిప్ పరికరాలన్నీ కాలి బూడిదయ్యాయి.


