మదనపల్లెటౌన్ : ఆటోబోల్తా పడి ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు, మదనపల్లె జిల్లా ఆస్పత్రిఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. బీరంగి కొత్తకోటకు చెందిన హమీదా, మోసీన మరో ముగ్గురు ఓ ఆటోలో బీసి కాలనీకి బయలుదేరారు. ఆటోలో వెళుండగా దారిలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చిక్సిలు చేయించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయంపై నుంచి పడి యువకుడికి..
మదనపల్లెటౌన్ : శ్రీరామ నవమి ఉత్సవాలను పురష్కరించుకొని రామాలయానికి డెకరేషన్ లైట్లు వేసే క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఆలయం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె మండలంలో ఆదివారం జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రానికి చెందిన శ్రీనివాసులు కొడుకు రాంబాబు (19), మదనపల్లె మండలంలోని వేంపల్లెలో ఉన్న రామాలయానికి శ్రీరామ నవమి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. వీరితో పాటు పనులకు ఉనక్రమించిన రాంబాబు ఆలయం పై భాగంలో డెకరేషన్ లైట్లు అమర్చుతుండగా ప్రమాద వశాత్తు ఆలయం పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వద్దురాలికి..
మదనపల్లెటౌన్ : ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వృద్దురాలు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఆదివారం గుర్రంకొండ మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని చెర్లోపల్లె గ్రామం, పాలకుంటవారిపల్లెకు చెందిన అనసూయమ్మ(62) రోడ్డు దాటుతుండగా చిన్నమండెం, మండలం, బోనమలకు చెందిన ఓ స్కూటరిస్టు వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయాడు. బాధితురాలిని కుటుంబీకులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం ఆమెను అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రకేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


