మదనపల్లెటౌన్ : మదనపల్లె మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆటో నగర్కు వెళ్లే రహదారులను ధ్వంసం చేయడం వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ, మొలకలదిన్నె సమీపంలోని ముంబై టు చెన్నయ్ జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వం ఆటోనగర్, ఏసీఐఐసీ, ఎంఎస్ఎంఈ లకు కేటాయించిన స్థలాల్లో వ్యాపారులు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీలు నెలకొల్పారు. ఫ్యాక్టరీలు నడుస్తున్న నేపథ్యం లో స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు రణయ్య, మోహన్లు తమకు ఉన్న పట్టా భూమిలో రోడ్డు ఉందని రహదారిని జేసీబీతో ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను వేశారు. దీంతో ఇండస్ట్రీలోకి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. అటుగా పల్లెలకు వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యను గుర్తించిన ఫ్యాక్టరీల యజమానులు స్థానిక తాలూక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కళా వెంకటరమణ ఘటనాస్థలానికి చేరుకుని వివాదానికి గల కారణాలపై ఆరాతీశారు. ఆటో నగర్లో నడుస్తున్న కుటీర పరిశ్రమలకు అంతరాయం కల్పించ వద్దని రమణయ్య, మోహన్లకు సీఐ సూచించారు. సమస్యపై సంబంధిత అధికారులతో మట్లాడి పరిష్కరించుకోవాలే గాని ఇలా ప్రజలను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్తంభించిన రాకపోకలు


