పెద్దతిప్పసముద్రం: స్నేహితులతో కలసి హంద్రీనీవా కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన అన్నమయ్య (27) అనే యువకుడు ఆదివారం మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని పులికల్లు పంచాయతీ గుడ్డంపల్లికి చెందిన లచ్చన్నగారి శ్రీనివాసులు కుమారుడు అన్నమయ్య మండల కేంద్రంలో సెల్షాపు నిర్వహించేవాడు. ఆదివారం ఇతను మరో ఇద్దరు స్నేహితులతో కలసి హంద్రీనీవా కాలువలో ఈత ఆడేందుకు వెళ్లారు. అయితే సమీపంలోనే అమర్చిన గేట్వాల్ ప్రాంతానికి అన్నమయ్య వెళ్లాడు. అక్కడ నీటి ఉదృతి అధికంగా ఉండటంతో నీళ్లన్నీ ఒక్కసారిగా యువకుడిని లోనికి లాగేసి తిప్పేయడంతో ఊపిరాడక చనిపోయి వంద మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు, గ్రామస్తులు యువకుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పెళ్ళీడుకొచ్చిన ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నవాళ్లు గుండెలు పగిలేలా రోదించారు. యువకుడి మరణంతో గుడ్డంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుడు అన్నమయ్య
అన్నమయ్య(ఫైల్)


