ఆటో బోల్తా : నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో దంపతులతో పాటు వారి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, గంగవరం మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన గంగరాజు (28), భార్య మాలశ్రీ (22), పిల్లలు తన్విక (04), తన్విత(04) కవలలతో కలిసి శనివారం రాత్రి ఆటోలో కర్ణాటకలోని తన అత్తగారి ఇంటికి బయలుదేరారు. ఎలగటూరు సమీపం లో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురూ తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ లారీ బోల్తా డ్రైవర్కు..
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రం నుంచి అంకిరెడ్డిపల్లి వరకు గత కొద్ది రోజులుగా తారు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అంకిరెడ్డిపల్లి సమీపంలో మట్టితో వెళుతున్న టిప్పర్ లారీ బోల్తా పడటంతో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే పైనున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్య్కూట్ కావడంతో వాహనం అదుపు తప్పినట్లు పలువురు పేర్కొన్నారు. టిప్పర్ లారీ లోని మట్టిని లిఫ్ట్ చేసే క్రమంలో ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డుపై వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిందే గాని పైనున్న విద్యుత్ తీగల కారణంగా ఈ ఘటన చోటు చేసుకోలేదని డిస్కం అధికారులు వెల్లడించారు. విద్యుత్ షాక్ అయితే విద్యుత్ లైన్ ట్రిప్ అయ్యేదన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రగా గాయపడ్డారు. ఈ సంఘటన పీలేరు మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పూతలపట్టు మండలం టీకేపల్లెకు చెందిన పి. దుర్గా ప్రసాద్ (42), ఎన్. మాధవ (39) ద్విచక్రవాహనంలో పొంతలచెరువు క్రాస్కు వెళుతుండగా ఠానావడ్డిపల్లె మలుపు వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దుర్గా ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన భరత్కుమార్ (24) ద్విచక్రవాహనంలో పీలేరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా పొంతలచెరువు క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్కుమార్ను చికిత్సనిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు.


